ఐటీ పార్క్ నిర్మించాలి.
జనం కోసం మనం న్యూస్ హైద్రాబాద్:
హైదరాబాద్ నగర శివార్లలో ఐటీ రంగం విస్తరణలో భాగంగా కుత్బల్లాపూర్ నియోజకవర్గంలో బౌరంపేట్, దుండిగల్ గ్రామాల పరిధిలోని 500 ఎకరాలలో ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. ఐటీ పార్కుఏర్పాటుతో భూములు కోల్పోతున్న ఆ రెండు గ్రామాల అసైన్డ్ రైతులకు నష్టపరిహారం అందేలా టీఎస్-ఐఐసీ తరపున చర్యలు తీసుకోవాలని వారు ఆ సంస్థ చైర్మన్ గ్యాదరి బాలమల్లును కోరారు. గురువారం టీఎస్-ఐఐసీ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ వెంకట్ నర్సింహారెడ్డితో రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమావేశమై ఐటీ పార్కు ఏర్పాటుపై చర్చించారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఐటీ పార్కులను అభివ్రద్ధి చేయాలని టీఎస్-ఐఐసీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న క్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఐటీ పార్కు ఏర్పాటుకు బౌరంపేట్, దుండిగల్ గ్రామాల్లో 500 ఎకరాల వరకు అసైన్డ్ భూములు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే తాము ప్రభుత్వం ద్రష్టికి తీసుకువెళ్లినందున, ఐటీ పార్కు ఏర్పాటుతో భూములు కోల్పోయే అసైన్డ్ రైతులకు ప్రభుత్వం తగు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఐటీ పార్కు కోసం అసైన్డ్ భూములను కోల్పొయే అసైన్డ్ రైతులంతా పేదలేనని, వారికి పరిహారం చెల్లింపుతోనే జీవనోపాధి దొరుకుతుందన్నారు. భూములు కోల్పోతున్న అసైన్డ్ రైతులను ఆదుకునేలా నిబంధనల మేరకు పరిహారం అందించడానికి టీఎస్-ఐఐసీ తరపున అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద టీఎస్-ఐఐసీ చైర్మన్ బాలమల్లును కోరారు. దీనిపై టీఎస్-ఐఐసీ చైర్మన్ బాలమల్లు సానుకూలంగా స్పందిస్తూ.. బౌరంపేట్, దుండిగల్ గ్రామాల్లో ఐటీ పార్కు ఏర్పాటు కోసం ప్రతిపాదిస్తున్న అసైన్డ్ భూముల సేకరణకు, నిర్వాసితులయ్యే రైతులకు నిబంధనల మేరకు పరిహారం అందేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని టీఎస్-ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డికి బాలమల్లు సూచించారు.
Comments
Post a Comment